
- భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలంలో ఘటన
ఇల్లెందు, వెలుగు : మరో మూడు రోజుల్లో బిడ్డ పెండ్లి ఉండడంతో బంధువులకు పత్రికలు ఇచ్చి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి చనిపోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని అందుగులబోడు గ్రామం వద్ద శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఇల్లెందు పట్టణంలోని 24 ఏరియాకు చెందిన పిల్లి శ్రీనివాస్ (61) సింగరేణి గెస్ట్ హౌస్లో కుక్గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్కు నలుగురు కూతుళ్లు ఉండగా మూడో కుమార్తెకు ఈ నెల 16న గోదావరిఖనికి చెందిన యువకుడితో వివాహం జరగనుంది.
ఈ క్రమంలో శ్రీనివాస్ శుక్రవారం కొమరారంలోని తన బంధువులకు పెండ్లి పత్రిక ఇచ్చి తిరిగి బైక్పై ఇల్లెందుకు వస్తున్నాడు. మండలంలోని మామిడిగూడెం వద్దకు రాగానే కోతులను తప్పించబోయి బైక్ అదుపు తప్పడంతో పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 16న కుమార్తె వివాహం, 31 శ్రీనివాస్ ఉద్యోగ విరమణ ఉండగా.. ఈ లోగానే ఇంటి పెద్ద చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.